ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్నికల కార్యాలయం నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (కలెక్టర్లు), ఇతర ఎన్నికల అధికారులతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ పోలింగ్ కు 78 గంటల ముందు, 48 గంటల ముందు చేయవలసిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, ఆదేశాలపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికలకు రిపోర్టులను సకాలంలో పంపించాలన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యలపై సమాధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున మద్యం, డబ్బు వంటివి పంపిణీ చేయకుండా వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. చెక్పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధింపు ఉంటుందని అన్నారు. 48 గంటల ముందు నుండి ఎలాంటి లౌడ్ స్పీకర్లకు అనుమతించవద్దని, ఎంసీఎంసీ ద్వారా మంజూరు చేసే రాజకీయ ప్రకటనల అనుమతులు తక్షణం జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు, తదితర సదుపాయాలతో పాటు పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు. పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూములకు తరలింపుజరగాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.ఎ. భారీ, డీఆర్వో
వై.వి. గణేష్, జడ్పీ సీఈవో విద్యాలత, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఏఆర్వో లు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: