ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మాదిరిగా క్రీడారంగంలోనూ దివ్యాంగులు ముందుకెళ్తున్నారని అన్నారు. దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. భవిష్యత్తులో దివ్యాంగుల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లా సంక్షేమ శాఖ ప్రోత్సహించాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైకల్యాన్ని అధిగమించేలా దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా ప్రోత్సహించాలన్నారు.
ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ క్రీడలు మనలోని శక్తిని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న దివ్యాంగులందరికీ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు క్రీడా పోటీల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొంటుండడం అభినందనీయమన్నారు. ఈ నెల 15వ తేదీన హనుమకొండ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న దివ్యాంగులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. వేడుకలకు దివ్యాంగులు హాజరుకావాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. కాగా పరుగు, షాట్ పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్, తదితర క్రీడా పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి. అజీజ్ ఖాన్, రెడ్ క్రాస్ సొసైటీ ఈసీ మెంబర్ ఈ.వి. శ్రీనివాసరావు, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్, సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోష్ కుమార్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు బిల్లా మహేందర్, సురేష్, ధనుంజయ, తదితరులతో పాటు మల్లికాంబ మనోవికాస కేంద్రం, బన్ను మనోవికాస కేంద్రం, శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాల, స్పందన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: