హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు లోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అధికారులను, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులకు పాఠం చెబుతుండగా కలెక్టర్ పాఠ్యాంశ బోధన తీరును పరిశీలించారు. పాఠశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ముల్కనూర్ లోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ పాఠశాలో వివిధ అభివృద్ధి పనులు, వసతుల కల్పన నిమిత్తం రూ. 30 లక్షల ను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులలో విద్యుత్ పనులు పూర్తయ్యాయని, టాయిలెట్స్ మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఫ్లోరింగ్ పనులు నడుస్తున్నాయని అన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న ఫ్లోరింగ్ పనులను త్వరితగతిన వచ్చేనెల నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం వండుతున్న కిచెన్ షెడ్ కు సంబంధించి మిగిలి ఉన్న ఫ్లాట్ ఫాం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ ఏరియా, తదితర పనులను కూడా వచ్చే పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రమాణాల ప్రకారం పౌష్టికాహారం నాణ్యతతో అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతతో పౌష్టిక ఆహారం అందుతుందా లేదా అనేందుకు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కమిటీని నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో భోజనం అందిస్తున్నారా లేదా అనేది పరిశీలించినట్లు పేర్కొన్నారు. మెనూ ప్రకారం అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు ఒక్కో మండల స్థాయి అధికారికి మూడు నాలుగు పాఠశాలలను కేటాయించినట్లు తెలిపారు. అధికారుల కేటాయించిన విధంగా మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు. రెగ్యులర్ గా మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామాజిక ఆర్థిక సర్వే డేటా ఎంట్రీ కేంద్రాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించినట్లు చెప్పారు. వంద శాతం సర్వే జిల్లాలో పూర్తయిందని, అర్బన్ ఏరియాలో తాళాలు వేసి ఉన్నాయి ఇళ్లలో కొన్నిమాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. వీటిని కూడా మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో డేటా ఎంట్రీ ప్రక్రియ మొదలైందన్నారు. సర్వే వివరాల డేటా ఎంట్రీ కూడా ఆరు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
ముల్కనూరులోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రావిణ్య మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, ఏఈ వినయ్, పాఠశాల ప్రిన్సిపల్ ఎండి రెహమాన్ ముజీబ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: