ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట జీవితం స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
గురువారం హనుమకొండ న్యూ శాయంపేట ఫంక్షన్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, ఇతర అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారని పేర్కొన్నారు. మహనీయులను భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా పరిచయం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ధైర్య సాహసాలు ఎప్పటికి స్ఫూర్తిగా నిలిచిపోతాయని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు సాయుధ పోరాటం చేశారని, ఒక మహిళ అయినప్పటికీ వీరనారీగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వస్తున్నారని అన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రఖ్యాతలు పెట్టిన చరిత్ర వారిది అని అన్నారు. భూమికోసం, పేదల విముక్తి కోసం పోరాటం చేసి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని, వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని స్మరించుకోవడం, ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వారి కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవం, మహిళా విశ్వవిద్యాలయానికి పేరును పెట్టడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాలను భవిష్యత్తులో ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వీలైతే హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని సరైన ప్రాంతంలో పెట్టినట్లయితే బాగుంటుందని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సుందరీకరణ జరుగుతున్న దృష్ట్యా వడ్డేపల్లి చెరువు, వరంగల్ చెరువు, న్యూ శాయంపేట జంక్షన్ ప్రాంతంలో అందరూ ఎలా ప్రతిపాదిస్తే అక్కడ విగ్రహాన్ని పెట్టి వచ్చే జయంతి నాటికి ఘనంగా జరుపుకొందామన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి , హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ చెట్ల మచ్చేందర్, పలు వు రు అధికారులతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ...
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఉద్యోగులు ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు.
రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, ఇతర అధికారులు, రజక సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు.
Post A Comment: