ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి మండలంలో పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రామాల్లో తాగునీటి సరఫరా కి సంబంధించిన యాక్షన్ ప్లాన్, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, పోలింగ్ కేంద్రాలలో కనీస సదుపాయాల కల్పనపై జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులు, పలు మహిళా సమైక్య అధ్యక్షులతో సమీక్ష సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రణాళికతో మౌలిక వసతుల సదుపాయాల ను కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో ముందుగా మైనర్ రిపేర్లని పూర్తిచేయాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఒక్కో పనిని పూర్తిచేస్తూ మే నెల నాటికి అన్ని పనులను పూర్తిచేయాలని సూచించారు. ప్రతి పాఠశాలను మోడల్ గా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలల్లో బాలికల కోసం టాయిలెట్ల నిర్మాణం, మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు. మహిళా సమాఖ్య గ్రూప్ అధ్యక్షులు పాఠశాలలను పరిశీలించి వాటికి కావాల్సిన పనులను మొదలుపెట్టాలన్నారు. ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని మహిళా సమాఖ్య అధ్యక్షులకు తెలియజేశారు. అర్బన్ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. గతంలో పలు పాఠశాలల్లో పనుల నిమిత్తం మన ఊరు మనబడి కార్యక్రమం కింద మంజూరు చేయడం జరిగిందని, పూర్తి అయిన పనులను వదిలిపెట్టి మిగతా పనులను పూర్తి చేయాలన్నారు. మంజూరైన నిధులతో తప్పనిసరిగా చేపట్టాల్సిన పనులను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో ఏయే పనులను పూర్తిచేయాలో ఇంజనీరింగ్, ఎంపీడీవో, ఎంఈఓ, ఇతర అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి...
జిల్లాలోని అన్ని మండలాల్లో మిగిలిన చోట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాలుగో తేదీన తప్పకుండా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
అదేవిధంగా పాఠశాలల్లో కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్స్, ర్యాంపు, ఇతర కనీస సదుపాయాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఏ పోలింగ్ కేంద్రంలోనూ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
వేసవికాలం దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఏవైనా మరమ్మతు పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వేసవికాలం దృష్ట్యా ఈజీఎస్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లతోపాటు అవసరమైన మందులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, డిఈవో డాక్టర్ అబ్దుల్ హై, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో నాగ పద్మజ, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, మిషన్ భగీరథ ఈఈ మల్లేశం, మెప్మా పీడీ భద్రునాయక్, డిఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, బీసీ వెల్ఫేర్ డిడి రామ్ రెడ్డి, డీఎస్ఓ వసంతలక్ష్మి, ఇతర అధికారులు, పలు మహిళా సమాఖ్య గ్రూప్ అధ్యక్షురాల్లు పాల్గొన్నారు.
Post A Comment: