ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిటర్నింగ్, సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించి, వారికి పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. రెండోవిడత ర్యాండమైజేషన్లో కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నంబర్లను కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ ప్యాట్లని ఆయా పోలింగ్ కేంద్రాలకు
కేటాయించే ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ తదితర అంశాల గురించి పరకాల, హనుమకొండ ఆర్డీవోలు శ్రీనివాస్,రమేష్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు లేకుండా సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల రోజున మాక్ పోలింగ్ ఎలా నిర్వహిస్తారు, ఏదైనా సమస్య వస్తే ఏ విధమైన చర్యలు చేపడతారని అధికారులను సాంకేతిక నిపుణులను అడిగి తెలుసుకున్నారు. సెక్టోరియల్ అధికారులు ఎన్నికల విధుల గురించి తెలుసుకున్న అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలను తరలించే క్లోజ్డ్ వెహికల్స్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి సెక్టోరియాల్ అధికారులకు అధికారులు సాంకేతిక నిపుణులు తర్ఫీదును ఇచ్చారు. ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ, పనితీరును గురించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో నిర్వహించారు.
Post A Comment: