మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు “తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సాహం” పేరుతో  సింగరేణిలో కూడా ఈ  దశాబ్ది ఉత్సవాలను ఆడంబరంగా  నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి గని కార్మికులు క్రియాశీలంగా పాల్గొన్నారు. మిలియన్ మార్చ్ , సకల జనుల సమ్మెలో చురుకుగా పాల్గొని, ఒక్క బొగ్గు పెళ్ల కూడా  బయటకు వెళ్ళకుండా  ఢిల్లీ ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా చేసి,  రాష్ట్ర ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి,పెద్దపల్లి, మంచిర్యాల,కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో బొగ్గు ఖనిజం అపారoగా ఉంది.

సింగరేణి బొగ్గును రాష్ట్ర అవసరాలకు వాడుకుంటూనే,  ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్,జార్ఖండ్,హిమాచల్ ప్రదేశ్,గుజరాత్,పశ్చిమ బెంగాల్,గోవా,చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం వస్తే , సింగరేణి లో ఓపెన్ కాస్టులను తగ్గిస్తామని, భూగర్భ గనులను పెంచుతామని , సింగరేణి పూర్తి వాటాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా  కొనుగోలు చేసి,  రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమగా నడిపిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గుగని కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తామని, డిపెండెంటు ఉద్యోగాలు కల్పిస్తామని, సింగరేణి లో ఉన్న వైద్యశాలలను మెరుగు పరుస్తామని, కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, కోల్ బెల్ట్ లో ఓపెన్ కాస్టుల విధ్వంసం వల్ల జరిగే అడవుల నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్ళీ అడవులను పెంచుతామని, కాగజ్ నగర్ నుండి మణుగూరు వరకు పారిశ్రామిక కారిడారు  ఏర్పాటు చేస్తామని”  హామీలు ఇచ్చారు. అన్నిటినీ మించి, సింగరేణి లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని కూడా తెరాస పార్టీ  హామీ  ఇచ్చింది. 

TRS ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 9 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ హామీలను అమలు చేసేందుకు పూనుకోలేదు. 2014 ముందు సింగరేణి లో పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. 2014 ముందు చనిపోయిన కార్మికుల వారసులకు, వయోభారంతో దిగిపోయిన (వాలంటీర్ రిటైర్మెంట్ (విఆర్.ఎస్) కార్మికుల కుటుంబాలకు కూడా సింగరేణిలో ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విధి నిర్వహణలో చనిపోయిన వారి పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారు. వయస్సు మీద పడి కొలువు చేయలేని వారి వారసులకు ఈ హక్కు రద్దు చేశారు.కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ బానిస వ్యవస్థకు నిదర్శమని,  తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని పదే పదే  చెప్పిన కేసీఆర్, సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులను మాత్రం పర్మినెంటు చేయలేదు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా  కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదు.

 లాభాలతో నడుస్తున్న సింగరేణిలో ఒక పర్మినెంటు కార్మికుడి స్థానంలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులను పెట్టుకుని,  అతి  తక్కువ వేతనాలతో వారితో పని చేయించుకుంటున్నారు. 2021 జులై నుండీ అమల్లోకి వచ్చిన 11వ వేతన ఒప్పందం ప్రకారం సింగరేణి లో 1వ కేటగిరి కార్మికుడి వేతనం రూ.50, 045. 90 నుండీ రూ. 58,486.33 లుగా ఉంది. కానీ, ఇదే పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మాత్రం రూ12,844 లు వేతనం చెల్లిస్తున్నారు. ఓపెన్ కాస్టు ఆపరేటర్ వేతనాలు రూ.53,385.20 ల నుండి రూ.68,949.06 లుగా ఉన్నాయి. కానీ,  అదే పనిచేస్తున్న కాంట్రాక్టు ఆపరేటర్ కు రూ. 21, 216 లు మాత్రమే చెల్లిస్తున్నారు.

జాతీయ బొగ్గు గనుల వేతన ఒప్పందం (ఎన్ సి డబ్ల్యూ ఏ) ప్రకారం 2013 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన వేతనాలను ఇతర రాష్ట్రాల బొగ్గు సంస్థల యాజమాన్యాలు  చెల్లిస్తున్నప్పటికీ, సింగరేణి కంపెనీలో మాత్రం గత 11 సంవత్సరాలుగా అమలు చేయడం లేదు. 

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని కాంట్రాక్టు కార్మికులే చేస్తూ కంపెనీ లాభాలలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.అయినప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లించేందుకు ముఖ్యమంత్రి సిద్ధం కాలేదు.కాంట్రాక్టు కార్మికులకు  8 గంటల పనిదినం అమలు చేయడం లేదు.

 యూనిఫామ్ ఇవ్వడం లేదు. పిఎఫ్, సెలవులు, అలవెన్సులు,హాస్పిటల్ లో వైద్యం లాంటి సౌకర్యాలు అమలు చేయడం లేదు. చివరికి ప్రమాదాలలో మరణించిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో పర్మినెంటు,  కాంట్రాక్టు కార్మికుల మధ్య వివక్ష చూపిస్తున్నారు. 

కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి క్యాంటిన్ లో టి,టిఫిన్, సింగరేణి ఆవిర్భావ వేడుకల లో కనీసం స్వీట్ ముక్క ఇవ్వడానికి కూడా యాజమాన్యానికి చేతులు రావడంలేదు. సింగరేణి సంస్థలో కాంట్రాక్టు కార్మికులపై జరుగుతున్న వివక్ష అసాధారణ స్థాయిలో ఉంది. తెలంగాణ ఇంక్రిమెంట్ ను కూడా సింగరేణి పర్మినెంటు కార్మికులకు మాత్రమే ఇచ్చి,  కాంట్రాక్టు కార్మికులకు అన్యాయమే చేశారు. 

సింగరేణిలో అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ కార్మిక సంఘం 2014 నుండి గుర్తింపు సంఘంగా ఉంది. సింగరేణిపై 51శాతం వాటాలు ఉండి పూర్తి ఆధిపత్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా, లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేసేందుకు, సమాన  పనికి సమాన వేతనం చెల్లించేందుకు, జాతీయ బొగ్గు పరిశ్రమలలో అమలవుతున్న వేతనాలు అమలు చేసేందుకు సింగరేణి యాజమాన్యం, గుర్తింపుసంఘం, రాష్ట్రప్రభుత్వం పూనుకోలేదు. 

2014 కు ముందు సింగరేణిలో 45 భూగర్భ గనులు, 11 ఓపెన్ కాస్టులు ఉండేవి. 72 వేల మంది పర్మినెంటు కార్మికులతో పాటు 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సంస్థలో పనిచేసేవారు.ఈ తొమ్మిదేళ్ల కాలంలో భూగర్భ గనులు 20 కి తగ్గిపోగా, ఓపెన్ కాస్టు లు 20 కి పెరిగాయి. పర్మినెంటు కార్మికులు 40 వేల మందికి తగ్గిపోయి,  కాంట్రాక్టు కార్మికులు 30 వేల మందికి పెరిగారు. సింగరేణిలో భూగర్భ గనుల మూసివేత యథేచ్చగా కొనసాగుతున్నది. కొత్తగా ఒక్క అండర్ గ్రౌండ్ బావిని కూడా కొత్తగా తీయలేదు. భూగర్భగనులను  మూసివేసి, వాటి పైనే  ఓపెన్ కాస్టులను ఏర్పాటు చేస్తున్నారు. 

ఇల్లందులో జెకె 5, 29 డిప్, స్టట్ ఫిట్ మైన్,కొత్త గూడెంలో వికే.7, 5 బి, మణుగూరులో పీకే 1 , పీకే. 2  బావులనే కాకుండా, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, రామగుండం ఏరియాలలో కూడా అండర్ గ్రౌండ్ బావులు మూసివేశారు. అక్కడే కొత్తగా ఓపెన్ కాస్టులను ప్రారంభించారు. 

భూగర్భ గనులుగా ప్రారంభిస్తామని  చెప్పిన,  కోయగూడెం పిట్ 1, 2 లను,సత్తుపల్లి బావులను ఓపెన్ కాస్టులు గా మార్చారు. గుండాలలో కూడా హామీకి భిన్నంగా  ప్రస్తుతం ఓపెన్ కాస్టుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు సింగరేణిలో కేవలం మట్టి తవ్వకాలు మాత్రమే ప్రైవేటు కాంట్రాక్టర్లు చేసేవారు.నేడు ఓపెన్ కాస్టులలో మట్టి తవ్వకాలతో పాటు బొగ్గుతవ్వకం,రవాణా, ఇతర పనులన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్ల తో చేయిస్తున్నారు.

2014కు సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ ప్రాంతాన్ని బొందల గడ్డలుగా, ఊర్లను స్మశానాలుగా చేశారని చెప్పిన కేసీఆర్ పాలనలో కూడా సీమాంధ్ర కాంట్రాక్టర్లు కొనసాగుతున్నారు.  వారితో జతకట్టిన కేసీఆర్ బంధు,మిత్ర,పరివారo జాయింటు గా ఓపెన్ కాస్టుల కాంట్రాక్టర్లు గా మారి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. పల్లెలు స్మశానాలుగా మారటం, అడవులను విధ్వంసం, గ్రామాలను ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేయటం కొనసాగుతూనే ఉన్నది.

9 ఏళ్ల కాలంలో సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్టులతో  పేద రైతులు లక్షలాది ఎకరాల భూములను కోల్పోయారు.వందలాది గ్రామాల ప్రజలు కొంపా, గోడు కోల్పోయి నిర్వాసితులయ్యారు. నిర్వాసితులకు కంపెనీ లో ఉద్యోగం ఇస్తామనీ, నష్టపోయిన వారికి పరిహారం ఇస్తామనీ ఇచ్చిన  హామీ ఇచ్చినా, ఈ హామీని, కొద్దిమందికి మాత్రమే అమలు చేసి  చేతులు దులుపుకుoటున్నారు.

సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి.సింగరేణి ప్రధాన కేంద్రంగా ఉన్న కొత్తగూడెం లో ప్రధాన హాస్పిటల్ ఉంది. ఏరియా స్థాయి దవాఖానాలతో పాటు కార్మిక వాడల్లో డిస్పెన్సరీలు ఉండేవి. ఈ తొమ్మిదేళ్ల  కాలంలో సింగరేణి కాలనీ లలో ఉండే హాస్పిటల్స్ మూత పడి పోయాయి. ఏరియా స్థాయి హాస్పిటల్స్ లో డాక్టర్లు, ఇతర సిబ్బంది లేరు. మందులు లేవు. మౌలిక సౌకర్యాలు పెరగలేదు. చిన్నచిన్న రోగాలతో వచ్చిన కార్మికులకు , వారి కుటుంబ సభ్యులకు  కూడా వైద్యం చేయలేక,  కొత్తగూడెం ఆసుపత్రికి పంపిస్తున్నారు.

సింగరేణి  ప్రధాన ఆసుపత్రిలో  వివిధ విభాగాలకు చెందిన డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఔట్ సోర్సింగ్  పద్ధతుల్లో పని చేస్తున్న డాక్టర్ల కు , నర్సులకు అతి తక్కువ వేతనాలను చెల్లిస్తున్నారు. సింగరేణి ప్రధాన వైద్యశాలలో 500 రకాల మందులు అవసరం కాగా,  200 రకాల మందులు కూడా అందుబాటులో ఉండవు . 

సింగరేణి లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 49 శాతం వాటాను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 లో ఇచ్చిన హామీని అమలు చేయక పోగా, సత్తుపల్లి,కోయ గూడెం,కళ్యాణ్ ఖని, శ్రావణ పల్లి బొగ్గుబావులను కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమ్మకానికి పెట్టారు.

ఎన్ సి డబ్ల్యూ ఏ వేతనాలు, చట్ట బద్ద సౌకర్యాలు అమలు చేయాలని 2015 ఫిబ్రవరి 12 నుండి సింగరేణి వ్యాప్తంగా ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో 35 రోజుల పాటు కార్మికులు నిరవధిక సమ్మె చేశారు.నాడు శ్రీరాంపూర్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో కోల్ ఇండియాలో అమలుచేస్తున్న అన్ని సౌకర్యాలను సింగరేణిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ హామీ అమలు కాలేదు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ 2022లో మరోసారి 18 రోజుల పాటు జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెచేశారు. కానీ ఈ  హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: