*మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్*
హనుమకొండ, మే 24: మోడల్ స్కూళ్లలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మోడల్ స్కూళ్ళలో గత పదేళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లుగా అర్హులైన పీజీటీలు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందలేక పోయారు. ఏళ్ళుగా ఒకే చోట పని చేయడంతో అనాసక్తితో పాటు అజమాయిషీ కొరవడింది.
మోడల్ స్కూళ్లు 2013లో ప్రారంభమైనా ఇప్పటి వరకు సబ్జెక్టు ఉపాధ్యాయులకు రోస్టర్ పద్ధతిలో కాకుండా ఖాళీల ప్రకారం కేటాయించారు. దీంతో దూర ప్రాంతాల ఉపాధ్యాయులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన షెడ్యూల్ ఒకటి, రెండు రోజుల్లో జారీ కావచ్చునని తెలుస్తోంది.
*500 మంది టీచర్లు*
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. సుమారు 500 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీలు) 200 మంది, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు 270 మంది, ప్రిన్సిపాళ్లు 30 మంది వీరిలో ఉన్నారు. అన్ని కేటగిరీల ఉపాధ్యాయులను బదిలీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 194 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3880 సాంక్షన్డ్ పోస్టులు ఉండగా 1236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 2838 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్ వ్యవస్థను ప్రారంభించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 700 స్కూళ్లను మంజూరు చేసింది. వీటిలో మొదటి దశ కింద తెలంగాణలో 194 స్కూళ్ళు ప్రారంభమయ్యా యి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ దశ కింద మిగతా స్కూ ళ్లు ప్రారంభం కాలేదు. 2013లో ఉపాధ్యాయుల నియామకం జరిగింది. అప్పటి నుంచి వారు పోస్టింగ్ వచ్చిన స్కూళ్లలోనే పని చేస్తున్నారు. బదిలీలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం మొదట ఈ స్కూళ్లను ప్రారంభించినా ఆ తర్వాత నిర్వహణ భాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది. ప్రతీ పాఠశాల భవనాన్ని అయిదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. రూ. 3 కోట్లతో ఫర్నీచర్ను సమకూర్చారు.
*బదిలీల్లో జాప్యం*
ఆయా పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా బదిలీలు చేపట్టలేదు. ఏడుకాడు బదిలీలు జరుగుతాయని ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. చాలా మంది ఉపాధ్యాయులకు ఇతర జిల్లాలోని పాఠశాలల్లో ఉద్యోగం రావడంతో కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బదిలీలకు పచ్చ జెండా ఊపడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ ప్రక్రియను వెంటనే చేపట్టి వేసవి సెలవులు పూర్తయ్యేలోగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు...
Post A Comment: