ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలకు రుణాలను అందించి ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశము శుక్రవారం జరిగినది.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చేందుకు క్యాంపులను నిర్వహించి రుణాలను ఇప్పించాలని బ్యాంకర్లను, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత సమావేశాల్లో చర్చకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశానికి పూర్తి వివరాలతో రావాలన్నారు.
ఈ సందర్భంగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2024-25ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 28 బ్యాంకులు 163 శాఖల ద్వారా 2023 - 24 సంవత్సరానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక రూ.4826 .41 కోట్లకు గానూ మూడవ త్రైమాసికానికి రూ.8078 .11 కోట్లు రుణ మంజూరు జరిగిందన్నారు. ప్రాధాన్యతా రంగములో వ్యవసాయ రంగానికి రూ.2624 .35 కోట్లు, పరిశ్రమల రంగానికి రూ.1470 .21 కోట్లు, విద్యా రుణాలు రూ.31 .26 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.34 .89 కోట్లు , ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ. 66 .85 కోట్లు రుణ మంజూరీ జరిగిందని తెలిపారు. ఇతర రంగములకు రూ.3850 .55 కోట్లు రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఖాతాదారులకు చేరువ, వికసిత భారత్ సంకల్ప్ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా ఆర్ధిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జీవన జ్యోతి బీమా యోజన కింద 67862 , సురక్ష బీమా యోజన ద్వారా 241756 ఖాతాదారులకు బీమా సౌకర్యము కల్పించటం జరిగిందన్నారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా సుమారు 49890 మంది ఖాతాదారులకు పెన్షన్ సౌకర్యము కల్పించటం జరిగిందన్నారు. ముద్ర యోజన ద్వారా 15756 మంది చిన్న వ్యాపారులకు రుణ మంజూరి చేసినట్లు తెలిపారు . ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా 135 యూనిట్స్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఎం. హరి ప్రసాద్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించిన వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయా బ్యాంకుల అధికారులను రుణాల మంజూరు, తదితర అంశాల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశములో నాబార్డ్ ఏజిఎం రవి, ఆర్.బి.ఐ అధికారి రెహమాన్, డీఆర్డీఓ నాగ పద్మజ , ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవీ లత, బీసీ వెల్ఫేర్ డిడి రామ్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ వెంకటనారాయణ, మెప్మా పీడీ బద్రు నాయక్, అగ్రికల్చర్ ఏడి దామోదర్ రెడ్డి, డీపీఎంలు దాసు, శ్రీకాంత్, ఎస్బిఐ ఆర్సెటి డైరెక్టర్ రవి, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: